సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన సంస్కృతి పరిరక్షణతో పాటు విద్య, ఉపాధికి సమప్రాధాన్యత

1 గంట క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 07:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గిరిజన కళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం

- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్

ప్రజాశక్తి - విజయవాడ: గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, నృత్య రీతులను పరిరక్షించడంతో పాటు గిరిజన విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. మల్లిఖార్జున నాయక్ తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం-2026 లో భాగంగా రెండో రోజు ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక విద్యను అభ్యసించడం ద్వారా గిరిజనుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజన కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. థింసా నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంలో గిరిజన సంక్షేమ శాఖ చేసిన కృషిని ఆయన అభినందించారు. మిగిలిన గిరిజన నృత్యాలు, కళారూపాలు, కళాకారులకు కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థ ద్వారా రాష్ట్రంలోని గిరిజన కళాకారుల పూర్తి వివరాలతో కూడిన డేటాబేస్ రూపొందించడంతో పాటు, వారి సంప్రదాయ సంగీత వాయిద్యాలను సేకరించి భద్రపరుస్తామని తెలిపారు. వర్ధమాన కళాకారులు, శిక్షకులకు అవసరమైన శిక్షణ అందించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన సాంస్కృతిక విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెప్పారు. కూచిపూడి, భరతనాట్యం వంటి సంప్రదాయ కళలకు లభిస్తున్న ప్రాధాన్యతతో సమానంగా గిరిజన నృత్య రీతులకు కూడా గుర్తింపు, ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్