ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ న్యాయ స్థానాల్లో పనిచేస్తున్న సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల నియామకాలను ఏడాదికి బదులుగా రెండేళ్ల కాలపరిమితితో చేపట్టేలా చర్యలు తీసుకుంటామని న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎమ్డి ఫరూక్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రిని బుధవారం కలిసిన స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు ప్రస్తుత ఏడాది కాల నియామకాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రికి వివరించి, పదవీకాలాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. నియామకాలు, కేసుల నిర్వహణలో జాప్యం నివారణకు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల పదవీకాలాన్ని రెండేళ్లకు పెంచే ఉద్దేశంతో గతేడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే అమలుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి న్యాయవాదుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు, వారి కుటుంబాలకు ఉచిత సమగ్ర ఆరోగ్య బీమా, నగదు రహిత వైద్య సేవలు కల్పించాలని కోరారు. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు ఐదేళ్ల పాటు నెలకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్లు (0)