ఎపి గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ నాగబాబు
ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని ఎపి గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) కోరారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగర వనంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలిసి గురువారం ఆయన మొక్కలు నాటారు. ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. తీర ప్రాంతంలో సహజ వనరులపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన నివేదికను పరిశీలించారు. అనంతరం సూర్యలంక నగర వనం నుంచి పొగురు దిబ్బ వరకు బోటులో ప్రయాణిస్తూ మడ అడవులను తిలకించారు. పొగురు దిబ్బ వద్ద తాటి విత్తనాలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ తీర ప్రాంతాలలో బీచ్ల అభివృద్ధి, మడ అడవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికతో పనిచేస్తోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను నాగబాబుకు, చలపతిరావుకు వివరించారు. అభివృద్ధిపై నివేదిక అందజేశారు. విద్యార్థులతో మొక్కలు నాటించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్డిఒ ఎ హరి కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిణి సౌజన్య జాస్తి, అటవీ శాఖ అధికారులు, టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)