అక్కడికక్కడే నలుగురు మృతి
కుటుంబ పెద్ద బుచ్చిరెడ్డిపాలెం హత్య కేసులో ప్రధాన నిందితుడు
ప్రజాశక్తి- శిoగరాయకొండ (ప్రకాశం జిల్లా) : నెల్లూరు జిల్లా టిపి.గూడూరు మండలం ఆర్.వి. కండ్రిగ గ్రామానికి చెందిన హరికృష్ణ (32) మంగళవారం తన కుటుంబంతో సహా గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నెంబర్ 2 ఉత్తర వైపున మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం... నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ శాఖ ఎఒ హత్య కేసులో హరికృష్ణ ప్రధాన నిందితుడు. హరికృష్ణకు శ్రీహరి స్వయానా మేనమామతోపాటు బావ అవుతారు. గత నెలలో పెంచలకోనకు వెళ్లి తిరిగి కారులో వస్తూ ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంజక్షన్ ఇచ్చి శ్రీహరిని హరికృష్ణ హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హరికృష్ణ పరారీలో ఉన్నట్లు చూపుతూ ఆయన కోసం గాలిస్తున్నామని నెల్లూరు జిల్లా పోలీసులు చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ ఆర్.వి.కండ్రికి వెళ్లి తన భార్య ప్రణీత (30), కుమార్తె మొహాంబిక (4), కుమారుడు కృష్ణ (3)లను కారులో శింగరాయకొండకు తీసుకొచ్చారు. వీరు నలుగురూ శింగరాయకొండ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు, శింగరాయకొండ సిఐ వై శ్రీహరి, ఎస్ఐ లేళ్ల సుధీర్ కుమార్ ఘటనా స్థలానికి పరిశీలించారు.








కామెంట్లు (0)