రైతు, కుమార్తె మృతి
కుమారుడి పరిస్థితి విషమం
ప్రజాశక్తి- జగ్గయ్యపేట : అప్పుల బాధతో ఓ రైతు గడ్డి మందు తాగి తన కుమారుడు, కుమార్తెకు తాగించిన సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతుతోపాటు కుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం నేలకొండపల్లి మండలం అప్పల నరసింహపురానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాసరావు (45) తన పది ఎకరాల పొలంతోపాటు గండ్రాయి గ్రామ రెవెన్యూ పరిధిలో ఆరు ఎకరాలు, పెద్ద మండవ గ్రామంలో మరో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొత్తం 28 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ వల్ల సాగు సక్రమంగా సాగలేదు. దీంతో, అప్పుల పాలయ్యారు. రైతు శ్రీనివాసరావు తన కుమార్తె లాస్య (14), కుమారుడు నిఖిల్ (10) లను తీసుకుని గండ్రాయి గ్రామ శివారుకు వచ్చారు. అక్కడ ఆయన గడ్డి మందు తాగారు. తన పిల్లలతో కూడా తాగించారు. అనంతరం శ్రీనివాసరావు తన బావమరిదికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పి ఫోను స్విచ్చాఫ్ చేశారు. వారు పోలీసుల సహాయంతో ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గ్రామ శివారుకు చేరుకున్నారు. స్థానికులు ఆ ముగ్గురినీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన నిమిషాల వ్యవధిలోనే శ్రీనివాసరావు, లాస్య మరణించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. శ్రీనివాసరావు తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.








కామెంట్లు (0)