ఐద్వా రాష్ట్ర పూర్వ కార్యదర్శి డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి
ప్రజాశక్తి - విజయవాడ : జెన్ జీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినులు తమ సమస్యలపై పోరాడాలని ఐద్వా రాష్ట్ర పూర్వ కార్యదర్శి డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి కోరారు. ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలు ఈ నెల 10,11,12న విజయవాడలో జరగనున్న నేపథ్యంలో మంగళవారం నగరంలోని పలు కళాశాలల విద్యార్థినులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. 15 కళాశాలల నుండి 150 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ‘మహిళా సాధికారత విభాగం’ అంశంపై మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో నిర్వహించిన సదస్సుకు డి.రమాదేవి, వి.సావిత్రి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ... జెన్ జీ ఉద్యమ స్ఫూర్తితో సమాజంలో జరిగే అన్యాయాలను విద్యార్థునులు ఎదిరించాలన్నారు. సామాజిక స్పృహ కలిగి ఉండాలని, ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తమను తాము కాపాడుకునే విధంగా ధైర్యంగా ఉండడమూ అంతే ముఖ్యమని చెప్పారు. మన కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా ఆ సమస్య అందరికీ తెలిస్తుందన్నారు. వరకట్నం ఇవ్వనిదే పెళ్లిళ్లు జరిగే పరిస్థితి నేడు లేదని, ఈ నేపథ్యంలో సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా అందరూ నిలబడాలని, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తికి మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఐద్వా పోరాడుతోందన్నారు. దీనిలో భాగంగా జరిగే ఐద్వా జాతీయ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, ఉమెన్స్ వింగ్ నుంచి తహసీన్, ఐద్వా సెంట్రల్ సిటీ కార్యదర్శి జి.ఝాన్సీ, పలువురు అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)