వర్చువల్గా పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
ప్రజాశక్తి - గన్నవరం : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసి, కోల్కత్తాలకు ఇండిగో సంస్థ నూతన విమాన సేవలను గురువారం ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి వర్చువల్ విధానంలో ఈ సేవలను ప్రారంభించారు. విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు... గన్నవరం విమానాశ్రయంలో తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. త్వరలోనే పుణే, అహ్మదాబాద్, కొచ్చిన్లకు కూడా సేవలు విస్తరిస్తామని తెలిపారు. విదేశీ ప్రయాణికుల కోసం గన్నవరం విమానాశ్రయంలోనే కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తయ్యేలా 'హబ్ అండ్ స్పోక్' విధానాన్ని, స్థానిక కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త టెర్మినల్ భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, నాగార్జున సాగర్, హుస్సేన్ సాగర్లలో సీ ప్లేన్ సేవలు కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. శబరిమల యాత్రికుల కోసం కొచ్చిన్కు, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం దుబాయ్కు విమానాలు నడపాలని ఎంపిలు కేశినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మికాంత్ రెడ్డి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాచారి, ఇండిగో స్టేషన్ మేనేజర్ కౌశిక్ విశాల్ పాల్గొన్నారు.
విమాన సర్వీసు వేళలు
ఇండిగో విమాన సర్వీసులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటాయి. ఇండిగో విమానం (6ఇ 6501) మధ్యాహ్నం 2.15 గంటలకు కోల్కతాలో బయలుదేరి 3.25 గంటలకు వారాణసి, అక్కడి నుంచి 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విమానం (6ఇ 6502) సాయంత్రం 6.20 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 8.15 గంటలకు వారాణసి, అక్కడ 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు కొల్కత్తా చేరుకుంటుంది. ప్రారంభం రోజున వారాణసి నుంచి 89 మంది ప్రయాణికులు గన్నవరం రాగా, గన్నవరం నుంచి 129 మంది వారణాసి వెళ్లారు.








కామెంట్లు (0)