- ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి
ప్రజాశక్తి-మైలవరం (కడప జిల్లా) : సోలార్ కంపెనీల మోసపూరిత ఒప్పందాలను వ్యతిరేకించాలని, సోలార్ ప్లాంట్ల కోసం రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేయడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా మైలవరం మండలంలోని దొడియం గ్రామంలో శనివారం సోలార్ బాధిత రైతులతో ఆయన సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ దొడియం, రామచంద్రయపల్లి పరిసర గ్రామాలకు చెందిన రైతులు సుమారు ఆరు సంవత్సరాల క్రితం తమ విలువైన భూములను సోలార్ ప్లాంట్ల కోసం అదాని కంపెనీకి ఇచ్చారని తెలిపారు. రైతులకు అరకొరగా మాత్రమే నష్టపరిహారం చెల్లించారని, ఇప్పటికీ పలువురు రైతులకు పూర్తి పరిహారం అందలేదని పేర్కొన్నారు. నష్టపరిహారం కోసం పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విమర్శించారు. సోలార్ కంపెనీలకు భారీగా లాభాలు వస్తున్నప్పటికీ భూములు కోల్పోయిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కంపెనీలు రైతులను మోసం చేయకుండా ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్లాంట్ల కారణంగా వ్యవసాయ పనులు కోల్పోయే కార్మికులకు కంపెనీల్లో ఉపాధి, పునరావాసం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్, జిల్లా కార్యదర్శి కె సత్యనారాయణ, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.








కామెంట్లు (0)