ప్రజాశక్తి-అమరావతి : కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలన్న కోర్టు ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు ముందు రోజు లేదా అదే రోజు కౌంటర్లు, నివేదికలు దాఖలు చేయడం సరికాదని పేర్కొంది. సకాలంలో వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, అధికారుల విషయంలో ఉదారంగా వ్యవహరించొద్దని ఎజి, ప్రభుత్వ న్యాయవాదులకు సూచించింది. జాప్యం ఉద్దేశపూర్వకంగా కాదని ఎజి తెలిపారు. శాఖల మధ్య సమన్వయం పెంచి ఇకపై గడువులోగా వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై స్థాయి నివేదికలు దాఖలు చేసేందుకు ధర్మాసనం.. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ పిల్ దాఖలు చేశారు. పోలీసుల సంక్షేమంపై హైకోర్టు సుమోటోగా మరో వ్యాజ్యాన్ని విచారిస్తోంది. ఈ రెండు కేసుల్లో నివేదికలకు సమయం కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.








కామెంట్లు (0)