- ఉన్నత స్థాయి సమావేశం వివరాలు వెల్లడించాలి
- బివి రాఘవులు డిమాండ్
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : అమెరికా యుద్ధోన్మాదాన్ని ప్రధాని మోడీ వ్యతిరేకించాలని, పశ్చిమాసియా పరిణామాల వల్ల ఇప్పటికే దేశం తీవ్రంగా నష్టపోతున్నా ఆయన మౌనంగా ఉండడం సరికాదని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఇంతటి అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని ప్రధాని ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో, అందులోని వివరాలేమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే అంశంపై ఉన్నతాధికారులు, మంత్రులతో కలిసి ప్రధాని చర్చించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. అమెరికా మళ్లీ ఇరాన్పై దాడులు ప్రారంభించిందని, దీనివల్ల అక్కడ పెద్ద ఎత్తున ఆస్తులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం అమెరికాకు సేవ చేస్తోందా, లేక వారి యుద్ధోన్మాదానికి మద్దతు ఇస్తోందా అనేది ప్రధాని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ప్రయోజనాలకు లొంగిపోయే వైఖరిని తక్షణమే విడనాడాలని, కేవలం దేశ ప్రయోజనాల కోసమే కేంద్రం కృషి చేయాలని హితవు పలికారు. ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీలను నివారించడానికి పార్లమెంట్లో గట్టి చట్టాన్ని తీసుకువచ్చామని ప్రధాని మోడీ చెబుతున్నారని, అయితే ఆ చట్టం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది భవిష్యత్తులోనే తెలుస్తుందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాల ద్వారానే లీకేజీలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షలను వికేంద్రీకరణ పద్ధతిలో రాష్ట్రాలే నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు. రాష్ట్రంలోకి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు గొప్పగా చెబుతున్నారని, అలాగైతే టాటా పవర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కు ఎందుకు తరలిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకువస్తున్నారని, అయితే, మరో 15 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న విశాఖపట్నం విమానాశ్రయాన్ని క్రమంగా మూసివేసి, కేవలం కార్పొరేట్ లాభాల కోసమే భోగాపురం ప్రైవేట్ విమానాశ్రయాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని మనుబోలు వద్ద జరిగిన లాకప్ డెత్ ను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు.
"ఎప్స్టీన్ ఫైల్స్" పుస్తకావిష్కరణ
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారానికి సంబంధించిన విశ్లేషణాత్మక గ్రంథం "ఎప్స్టీన్ ఫైల్స్" పుస్తకాన్ని రాఘవులు ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పుస్తకాన్ని పరిచయం చేస్తూ మాట్లాడారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక శక్తులు, కార్పొరేట్ వర్గాలు, అధికార వ్యవస్థల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని కోరారు. రాఘవులు మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న కీలక పరిణామాలను విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించే పుస్తకాల పఠనం నేటి కాలంలో అత్యంత అవసరమని అన్నారు.








కామెంట్లు (0)