- అథారిటీలో నిర్ణయం
- 2024 నుండి భూములిస్తున్న వారికి 40 వేల కౌలు
- రెండోదశలో రుణమాఫీకి నిర్ణయం
- సీడ్ యాక్సెస్ రోడ్డులో సేకరణ ప్రక్రియ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న 25 టౌన్షిప్లలో 25 ఇంటర్నేషనల్ స్కూళ్లను నిర్మించాలని సిఆర్డిఎ అథారిటీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సిఆర్డిఎ అథారిటీ 63వ సమావేశం మంగళవారం జరిగింది. రెండోదశ ల్యాండ్ పూలింగు ఏరియాలో రుణమాఫీ, సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వని చోట సేకరణ ప్రక్రియ అమలు, లేఅవుట్ల అభివృద్ది వంటి అంశాలపై చర్చించారు. సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. రాజధానిలో 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇస్తున్న రైతులకు ఏడాదికి రూ.40 వేలు కౌలు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని వివరించారు. ఇది భూమి ఇచ్చినప్పటి నుండి పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా జరీబు భూమికి ఎకరాకు 5000, మెట్ట భూమికి ఎకరాకు 3000 పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. రోడ్లు వేసే సమయంలో గ్రామ కంఠాల్లో భూములు కోల్పోతున్న వారికి అద్దె కింద 10,000 ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కొత్తగా పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములిచ్చే రైతుల కుటుంబాలకు రుణ మాఫీ చేసేందుకు అథారిటీ నిర్ణయించిందన్నారు. 2026 జనవరి ఆరోతేదీ లోపు లోన్ తీసుకున్న వారికి ఇది అమలవుతుందని వివరించారు. ఇనామ్ భూముల కొరకు దేవాదాయ శాఖకు రూ.159 కోట్లు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో 25 టౌన్ షిప్ లలో ఒక్కో టౌన్ షిప్ లో తప్పనిసరిగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సిఎం చెప్పారని, దీని వెంటనే అమలు చేస్తామని వివరించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ కు భూములివ్వని వారికి బుధవారం నుండి భూసేకరణ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 2.5 ఎకరాలకు అమలు చేస్తామని వివరించారు. సిడ్ యాక్సిస్ కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన భూములకు మాత్రమే అక్విజిషన్ అమలవుతుందని పేర్కొన్నారు.








కామెంట్లు (0)