మాజీ మంత్రి పేర్ని నాని
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోనూ ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో నిరసనలు జరగాల్సిన అవసరం ఉందని, దీనిపై యువత ఆలోచించాలని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలని, దాని కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్సి అక్రమాలపై 31న కలెక్టర్లకు వినతిపత్రాలిస్తామని, ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకూ రిలే దీక్షలు చేపడతామని, ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు విద్యాశాఖను వాడుకున్నారని, నియామక ప్రక్రియను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. టిడిపి నేతల చేతుల్లో క్రీడా సంఘాల నుంచే సర్టిఫికెట్లు పెట్టుకుని డబ్బులు వసూలు చేశారని, జిఓలు మార్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్పై జగన్ ముద్ర : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం రూ.1,200 కోట్లకు పైగా ఖర్చు చేసింది వైసిపి ప్రభుత్వమేనని, భూసేకరణ నుంచి పునరావాసం వరకు జగన్ హయాంలోనే పూర్తయిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలిపారు. అనుమతులు, ఎన్ఒసిలు, మౌలిక వసతులన్నీ వైసిపి ప్రభుత్వమే చేసిందన్నారు. రెండేళ్లయినా విశాఖ–భోగాపురం కనెక్టివిటీ రోడ్డును కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు. ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీని సిఎం చంద్రబాబు మానుకోవాలన్నారు.








కామెంట్లు (0)