వైసిపి పిటిషన్
ప్రజాశక్తి-అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తై తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా చేపడుతున్న ఎస్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలకు 01.07.2026ని అర్హత తేదీగా నిర్ణయించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026ని అర్హత తేదీగా తీసుకుని స్థానిక సంస్థల వార్డుల ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల ప్రక్రియను చేపడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు జులై 31న ప్రచురించగా, అందులో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారి పేర్లు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లు ఉన్నాయన్నారు. ఎస్ఐఆర్ తుది జాబితా అక్టోబరు 3న వెలువడాల్సి ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ పూర్తికాకముందే పాత జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ప్రాంతానికి అసెంబ్లీ, స్థానిక సంస్థలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఏర్పడతాయన్నారు.








కామెంట్లు (0)