టిడిపి కేడర్కు చంద్రబాబు పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని టిడిపి కేడర్కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శిక్షణ తరగతుల ట్రైనర్స్తో సమావేశమై ప్రశంసా పత్రాలను శుక్రవారం అందజేశారు. అనంతరం యూనిట్ ఇన్ఛార్జులతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విలువలు, సిద్ధాంతాలను కొత్త నాయకత్వానికి అందించేందుకు శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదిరించి పెట్టుబడులు పెట్టించారని, ఆ పార్టీ అధ్యక్షుడి వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుపాలయ్యారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం జగన్కు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం జరిగేకొద్దీ అధికార కూటమికి నష్టం కలుగుతుందనే భ్రమలో జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎస్ఐఆర్ వ్యవహారంలో వైసిపి కోర్టుకు వెళ్లిందన్నారు. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శక పద్ధతిలో జరిగితేనే రాష్ట్ర రాజకీయ స్థిరత్వానికి నాంది పలికినట్లవుతుందని అన్నారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది ఒక చట్టపరమైన రక్షణ మాత్రమేనని తెలిపారు. చట్టం పరిమితులతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ బిసిలకు టిడిపి ఎక్కువ స్థానాలు ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి, వచ్చే ఏడాదిలోనే ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు తెలిపారు.








కామెంట్లు (0)