ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోక్సో కేసుల దర్యాప్తు, బాధితుల రక్షణ, సాక్ష్యాల పరిరక్షణ, నిందితులపై కఠిన నిఘా వంటి అంశాలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి బుధవారం ఆయన లేఖ రాశారు. ఇదే అంశంపై ఎపి సిఎస్, డిజిపికి కూడా ఆయన లేఖ రాశారు. ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, భయరహిత జీవనం కల్పించడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. పోక్సో చట్టం అమలులో జాప్యాలు లేకుండా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా రెహ్మతాబాద్ దర్గా సజ్జాదా నషీన్పై 2023లో హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్టేషన్లో పోక్సో కేసు నమోదైందని, అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక బాధ్యతలు కొనసాగిస్తున్నారనే విషయంపై ముస్లిం మత పెద్దలు, స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఇటీవల జరిగిన ఆరుగురు హత్యల ఘటనను ప్రస్తావిస్తూ, పోక్సో కేసుల్లో బాధితులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. పోక్సో చట్టం అమలు మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఆయన పలు సూచనలు చేశారు. అలాగే పోక్సో కేసుల కోసం ప్రత్యేక పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయడం, ప్రతినెలా సమీక్షలు నిర్వహించడం, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాల్లో చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రొటోకాల్ అమలు చేయాలని సూచించారు. ఈ అంశాలపై ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలతో 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని పవన్ తన లేఖలో కోరారు.








కామెంట్లు (0)