- 9 వీధి నాటకాలు , అభ్యుద గీతాలాపన
- సినీ ప్రముఖులు హాజరు
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఈనెల 25 నుంచి 27 వరకు కర్నూలు నగరంలో ప్రజానాట్య మండలి మహాసభలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.అనిల్ కుమార్ తెలిపారు. ఆయన ప్రజాశక్తితో తెలిపిన వివరాల ప్రకారం. .. మహాసభకు 28 జిల్లాల నుంచి 400 మంది ప్రతినిధులు, కళాకారులు హాజరవుతారు. ఈ మహాసభలకు సినిమా ప్రముఖులు విలక్షణ నటుడు అజయ్ ఘోష్, అంకురం దర్శకుడు ఉమామహేశ్వరరావు, మరోదర్శకుడు బాబ్జి, సినీనటి కర్నూలుకు చెందిన ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న, ప్రముఖ విశ్లేషకులు, సాహితీవేత్త తెలకపల్లి రవి హాజరవుతున్నారు. మొదటి రోజు సాయంత్రం కర్నూలులో బళ్లారి చౌరస్తానుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు కళాకారులు, ప్రతినిధులతో భారీ ప్రదర్శన ఉంటుంది. రోజుకు మూడు వీధినాటకాల చొప్పున మూడు రోజుల్లో తొమ్మిది వీధినాటకాలు ప్రతిరోజు సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శిస్తారు. మొదటి రోజు ప్రదర్శన 25న సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. డప్పుకళాకారులు, గొరవయ్యలు, ఇతర జానపద కళాకారులు, చెక్కభజన, కోలాటాలు ప్రదర్శనలో ఉంటాయి.
మొదటి రోజు సినీ నటుడు అజయ్ ఘోష్, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ఆహ్వాన సంఘం అధ్యక్షులు జి.పుల్లయ్య, ఇతర ఆహ్వాన సంఘం నాయకులు హాజరవుతారు. రెండో రోజు బాబ్జి, విజయలక్ష్మీ, డాక్టర్ శంకర్ శర్మ పాల్గొంటారు. చివరి రోజు ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న, ప్రజాశక్తి డిఫ్యూటి ఎడిటర్ రాంభూల్ పాల్గొంటారు. ప్రతిరోజు వీధినాటకాలతోపాటు నృత్యరూపకాలు , డ్యాన్సులు, పాటలు ఉంటాయి. కుసుమధర్మన్న, మాకొద్దీనల్లదొరతనం, గురజాడ , సుందరయ్యలపై రూపకాలు ఉంటాయి. సౌహార్థ సందేశాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి , ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి ఉంటాయి.
వీధినాటకాల్లో అల్లాబోల్ సర్దార్ హష్మికి సంబంధించి కార్మికుల జీవితాలు తెలిపేనాటకం, దొంగబాబాలను తెలియజెప్పే నాటకం, గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేక నాటకం, కష్టజీవులు, సాధారణ ప్రజలకు గురించి తెలిపే గొర్రెలు తిరగబడుతాయినాటకం, కులవివక్షను తెలిపేది ఏకులంమీది , లేబర్ కోడ్లను వివరించే నాలుగు ఉరితాళ్లు నాటిక , రాయలసీమ రైతు నాటిక , సెల్ ఫోన్ గురించి తెలిపే ఓ భార్య..ఓ...భర్త, ఇందో అది , ఆదివాసీల సమస్యలు తెలిపే పెళ్లితంతు ఇలా తొమ్మిది నాటికలు రోజుకు మూడు చొప్పున ఉంటాయి.
మహాసభలు కామ్రెడ్ జి.సన్యాసీరావు, కె.పెంచలయ్యనగర్ (డైమండ్ ఫంక్షన్ హాలు వక్కెవాగుదగ్గర), సర్దార్ హష్మీ , గాలిసుబ్బారెడ్డి కళాప్రాంగణం ఓపెన్ థియేటర్ మార్కెట్ యార్డులో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం నాటికిలు, అభ్యుదయగీతాలు, నృత్య రూపకాలు ఉంటాయి. రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి. కామ్రెడ్ జి.కాశీవిశ్వనాథ్, ఎస్.లక్ష్మీనారాయణ ద్వారం, వీధినాటకాల ద్వారానికి ఆర్ఎ.వాసు, నాగరాజు పేరుతో ఏర్పాటు చేస్తున్నాం. మార్కెట్ యార్డులో నిర్వహించే నాటకాలు, నృత్యరూపకాలు, అభ్యుదయ గీతాలు కార్యక్రమాలకు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.







కామెంట్లు (0)