- సిఎస్ అధ్యక్షతన ఆమోదించిన సంస్కరణల కమిటీ ఆమోదం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల్లో చేపట్టిన ఆర్డిఎస్ఎస్ పనుల గడువును పొడిగించేందుకు విద్యుత్ పంపిణీ సంస్కరణల కమిటీ ఆమోదించింది. కమిటీ సమావేశం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సాయిప్రసాద్ మాట్లాడుతూ మూడు డిస్కంలు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, జిఐఎస్ ఆధారిత సర్వేలు, ప్రాజెక్టు పరిధిలో మార్పులు, రైట్ ఆఫ్ వే సమస్యలు, చట్టపరమైన అనుమతులు, విద్యుత్ షట్డౌన్ పరిమితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, తదితర క్షేత్రస్థాయి సమస్యల కారణంగా కొన్ని పనులు ఆలస్యమయ్యయని తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత సాంకేతిక నష్టాలు గణనీయంగా తగ్గడంతో పాటు విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎస్ తెలిపారు. విశాఖపట్నంలో భూగర్భ విద్యుత్ కేబులింగ్ పనులను గడువులోగా పూర్తిచేయాలని, నాణ్యతా ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలు-2027 కోసం రూ.521.58కోట్ల విద్యుత్ మౌలిక సదుపాయాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా విశాఖపట్నంలోని ప్రస్తుత ఎస్సీఏడీఏ వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం, రాజమహేంద్రవరంలో కొత్త ఎస్సీఏడీఏ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం రూ. 176.04 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, మూడు డిస్కంల సిఎండిలు ఎల్ శివశంకర్, ఐ పృథ్వీతేజ్, పి పుల్లారెడ్డి పాల్గొన్నారు.








కామెంట్లు (0)