ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నేరడి బ్యారేజీ, అనుబంధ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ పనులకు రూ.641.10 కోట్ల అంచనా వ్యయంతో అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు పనులకు తొలుత రూ.722.10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సమర్పించగా, ప్రభుత్వం పరిశీలన అనంతరం రూ.641.10 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. భూసేకరణ, పునరావాసం, పునరావాస పునరావాస చర్యలకు సంబంధించిన వ్యయం ఏదైనా ఉంటే, అది కూడా మంజూరైన మొత్తం రూ.641.10 కోట్ల ప్రాజెక్టు వ్యయంలోనే సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నేరడి బ్యారేజీ, దాని అనుబంధ నిర్మాణ పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ఉత్తర కోస్తా చీఫ్ ఇంజనీర్ను ప్రభుత్వం ఆదేశించింది.
హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనులకు రూ.312 కోట్లు
హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (హెచ్ఎన్ఎస్ఎస్) రెండో దశలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు, మిగిలిన కాలువలు, క్రాస్ డ్రైనేజీ పనుల కోసం ప్రభుత్వం రూ.312 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ పనులకు గతంలో రూ.241.20 కోట్ల పరిపాలనా అనుమతి ఉండగా, సవరించిన అంచనాల మేరకు అదనంగా రూ.70.80 కోట్లు పెంచుతూ జలవనరుల శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పనులు శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం, ముదిగుబ్బ మండలాల పరిధిలోని కాలువ ప్రాంతాల్లో కొనసాగనున్నాయి.








కామెంట్లు (0)