- ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎడికి వినతి
ప్రజాశక్తి - మంగళగిరి ( గుంటూరు జిల్లా) : చేనేత కార్మికుల కొత్త పింఛన్ దరఖాస్తులకు నిబంధనలుగా విధించిన ఆన్లైన్ మజూరి (కూలి) వివరాలు, ముడిసరుకు కొనుగోలు జిఎస్టి బిల్లుల నిబంధనలను తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం మంగళగిరిలోని రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ రాజారావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. మాస్టర్ వీవర్ నుంచి బ్యాంకు ఖాతా ద్వారా ఆన్లైన్లో మజూరి పొందుతున్నట్లు ఆధారం చూపాలనే నిబంధనను తొలగించాలని, నూలు, ముడిసరుకు కొనుగోలుకు జిఎస్టి బిల్లు తప్పనిసరి చేయకూడదని కోరారు. స్పందించిన రాజారావు... ఆన్లైన్ మజూరి నిబంధన తొలగింపునకు చర్యలు తీసుకుంటామని, మాస్టర్ వీవర్ ధ్రువీకరణ ఇవ్వని సందర్భంలో హ్యాండ్లూమ్ ఎడి ద్వారా ధ్రువీకరించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవంగా నేత నేసే అర్హులైన ప్రతి కార్మికుడికి పింఛను అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎడికి వినతిపత్రం అందజేసిన వారిలో రాష్ట్ర కో-కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ, పిల్లలమర్రి నాగేశ్వరరావు, రామనాథం పూర్ణచంద్రరావు, బత్తూరి మోహనరావు, డోకుపర్తి రామారావు, భీమిశెట్టి బాలతీడేరు, గజవెల్లి వెంకట కృష్ణారావు, దొడ్డి ఈశ్వరరావు, గంజి శ్రీనివాసరావు ఉన్నారు.








కామెంట్లు (0)