- సాయికృష్ణ తల్లికి సిఎం చంద్రబాబు హామీ
- ఇప్పటికే సిఐపై వేటు వేశాం
- కుటుంబానికి అండగా ఉంటామన్న సిఎం
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, అతని కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసిన సాయికృష్ణ తల్లి తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐ నాగరాజుని సస్పెండ్ చేశామని, పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఈ విషయంలో తప్పుచేసింది ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన కుమారుని అదృశ్యం విషయంలో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం సాయికృష్ణ మేనమామ కుటుంబ సభ్యులతో కలిసి వీడియాతో మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని సాయికృష్ణ మేనమామ నవరంగ్ పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి బాధను సిఎం చంద్రబాబు అర్థం చేసుకున్నారని వెల్లడించారు. బాధ్యులైన అధికారులను శిక్షిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మాలాంటి సామాన్యులకు న్యాయం జరగదని ఇప్పటి వరకూ భావించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చొరవతో న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందన్నారు. రాజకీయంగా మాకు ఎవరిపైనా ద్వేషం లేదని చెప్పారు. న్యాయం చేయాలని మాత్రమే సిఎంను కోరామన్నారు. ఇలాంటి అన్యాయం మరో మనిషికి జరగకూడదని పేర్కొన్నారు.









కామెంట్లు (0)