- సుందరయ్య భవన్లో నివాళులర్పించిన వామపక్ష నేతలు
- నర్సంపేట మెడికల్ కాలేజీకి భౌతిక కాయం అప్పగింత
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : సిపిఎం సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ నేత పుచ్చకాయల చంద్రారెడ్డి (92) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం వరంగల్ రాంనగర్లోని సిపిఎం కార్యాలయం సుందరయ్య భవన్లో ఉంచారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు జి రాములు, పలువురు వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. పిసిఆర్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఎర్రజెండాను ఈ తరానికి అందించిన నాయకులు చంద్రారెడ్డి అని కొనియాడారు. ఆయన భౌతిక కాయాన్ని తన స్వగ్రామం నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం నాచినపల్లికి తరలించారు. అక్కడ గంటపాటు ప్రజల సందర్శనార్ధం ఉంచి అక్కడి నుండి నర్సంపేట మెడికల్ కాలేజీకి చంద్రారెడ్డి భౌతిక కాయాన్ని అప్పగించారు. పిసిఆర్కు నివాళులర్పించిన వారిలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, సారంపల్లి వాసుదేవరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.








కామెంట్లు (0)