ప్రజాశక్తి- కలెక్టరేట్(విశాఖపట్నం) : అక్రమంగా అరెస్టు చేసి 27 రోజులుగా జైల్లో నిర్బంధించిన ఎస్ఎఫ్ఐ బీహార్ రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమారి సహా 39 మందిని వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సింగ్ హోటల్ జంక్షన్ నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం.సాజి, శ్రీజెన్ భట్టాచార్య మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసి 27 రోజులు గడిచినా విడుదల చేయకుండా జైలులో నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనన్నారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి ఉద్యమాలను అణచివేయా లనే ఉద్దేశంతో బీహార్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు.
శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాలపై తప్పుడు కేసులు బనాయించడం తగదన్నారు. వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, వారిపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థి ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధ వైఖరిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అరెస్టులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యలేనని, విద్యార్థుల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను ఎస్ఎఫ్ఐ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ర్యాలీ, నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అఖిలభారత ఉపాధ్యక్షులు సుభాస్ జాకర్, నాగరాజు సహాయ కార్యదర్శులు ఐసీగోస్, సంజీవ్ పిఎస్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహనరావు, కె.ప్రసన్న కుమార్, జిల్లా నాయకత్వంతో విద్యార్థులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)