రామభక్త హనుమంతునిపై యాత్రికులను కటాక్షించిన శ్రీవారు
ప్రజాశక్తి–తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై యాత్రికులకు దర్శనమిచ్చారు. రామభక్త హనుమంతునిపై కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో యాత్రికులు తిరుమలకు తరలివచ్చారు.
వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, యాత్రికుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ వైభవంగా సాగింది. యాత్రికులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ ‘గోవిందా... గోవిందా...’ అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)