- జిల్లా డిఎంహెచ్వోకు మంత్రి సవిత ఆదేశాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కడప జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో కరోనా నివారణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ను, డీఎంహెచ్ వో రవిబాబును ఫోన్లో ఆదేశించారు. కడపలో ఎనిమిది కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా ఇద్దరు మృతి చెందారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ -19 నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ శ్రీధర్, డిఎంహెచ్ వో రవిబాబు మాట్లాడుతూ ఎనిమిది కరోనా కేసులు మినహా కొత్తగా కేసులు నమోదు కాలేదన్నారు. ప్రస్తుత కరోనా వెరియంట్ వ్యాప్తిపై శాంపిళ్లను పూణే ల్యాబ్ కు పంపామని చెప్పారు. ప్రస్తుతం నమోదైన కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందుతుందా... నెమ్మదిగా సోకుతుందా..? అనేది ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులో వెల్లడవుతుందన్నారు. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టామని, బ్లీచింగ్ వెదజల్లామని తెలిపారు. కరోనా నమోదైన కుటుంబాల్లో సభ్యులకు కూడా తక్షణమే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ వార్డుకు, నెగిటివ్ వస్తే ఇళ్లల్లోనే ఐసోలేషన్ లో ఉంచాలని చెప్పారు. మరో మరణం సంభవించకుండా ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉన్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మేరకు కోవిడ్-19 టీకాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.








కామెంట్లు (0)