ప్రజాశక్త-కాకినాడ : ఫీజు కట్టలేదని అవమానించారని స్థానిక లక్ష్మీనారాయణ నగర్ లో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న ఫైలా అరవింద్ (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన విద్యార్థి సోదరుడు గౌతమ్ వెల్లడించిన వివరాల ప్రకారం తన సోదరుడు పైలా అరవింద్ ను ఎంపీసీ గ్రూపులో స్థానిక లక్ష్మీనారాయణ నగర్ లో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగిందన్నారు. అయితే పదేపదే తన సోదరుడు అరవింద్ పట్ల వైస్ ప్రిన్సిపాల్ రమేష్ తో పాటు మరికొంతమంది ప్రతిరోజు అవమాన రీతిగా మాట్లాడడం వేధించడం జరుగుతుండేదన్నారు. ఈ విషయంపై శుక్రవారం తన తండ్రి రాంబాబును తీసుకొని అరవింద్ కాలేజీకి వెళ్లగా యధావిధిగా వైస్ ప్రిన్సిపల్ రమేష్ అవమాన రీతిగా మాట్లాడడమే కాకుండా బయటికి పొమ్మని గట్టిగా అరిచి భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. దీంతో తన సోదరుడు అరవింద్ ఇంటికి వచ్చి అవమానబారాన్ని భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. 'ఫీజు కట్టడం చేతకాని వాడికి ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావు' అంటూ ఫీజు కోసం తన సోదరుని పదేపదే అవమానిస్తూ, భయభ్రాంతులకు గురిచేసి తన సోదరుడు మృతికి కారణమైన కళాశాల యాజమాన్యం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అరవింద్ సోదరుడు గౌతం, తల్లిదండ్రులు రాంబాబు, జ్యోతిలు కోరుతున్నారు.
కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన కళాశాల యాజమాన్యం, కళాశాల సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ కళాశాల ప్రారంభమై నెలరోజులు కూడా కాకుండా ఫీజుల కోసం కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు దౌర్జన్యంగా విద్యార్థులు, తల్లిదండ్రుల మీద దాడికి పాల్పడుతున్నారో విద్యార్థి అరవింద్ మృతి ఒక నిదర్శనమని అన్నారుర. వెంటనే అరవిందు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)