ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: జల్ జీవన్ మిషన్ అమలో భాగంగా రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్లోని సంస్కరణల అమలులో భాగంగా పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ తాగునీటి రంగంలో వినియోగించడమే కమిటీ ప్రధాన లక్ష్యం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిటీకి అధ్యక్షత వహిస్తారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సభ్య కార్యదర్శి, కన్వీనర్గా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ రాష్ట్ర నోడల్ సలహాదారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఏపీ జల్ జీవన్ మిషన్ వాటర్ కార్పొరేషన్ ఎండి, భూగర్భజల శాఖ డైరెక్టర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. యూనిసెఫ్ ప్రతినిధి, సాంకేతిక సలహాదారు, ఐఐటీలు, ఐఐఎంలు, జాతీయ జలవిజ్ఞాన సంస్థ, సీఎస్ఐఆర్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులకు కూడా చోటు కల్పించారు. గ్రామీణ తాగునీటి రంగంలో తక్కువ ఖర్చుతో, విస్తృతంగా అమలు చేయగల స్థానిక సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడం కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఆవిష్కరణలు, రూపకల్పన, తయారీ సామర్థ్యాలను పెంపొందించడం, కొత్త సాంకేతికతలను క్షేత్రస్థాయిలో పరీక్షించడం, విజయవంతమైన వాటిని విస్తృతంగా అమలు చేయడం వంటి బాధ్యతలను కమిటీ చేపడుతుంది. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, అంకుర సంస్థలు, అమలు సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఉత్తమ విధానాలు, క్షేత్రస్థాయి అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిలకు చేరేలా చేయనుంది.
గ్రామీణ తాగునీటి రంగంలో పరిశోధన, సాంకేతికతకు సాంకేతిక కమిటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)