- వైసిపి ఎమ్మెల్సీల గురుపరిరక్షణ దినంలో వక్తలు
- డిఎస్సి నోటిఫికేషన్లో అన్నీ అక్రమాలే
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, దీనిపై కేంద్రాన్ని ఒప్పించాలని వైసిపి గురుపరిరక్షణ దినోత్సవంలో పలువురు వక్తలు డిమాండు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, పి.సురేష్ బాబు, ఇసాక్ బాషా, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్ కుమార్, రామచంద్రారెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం, రూహుల్లా, కల్పలతా రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దీక్ష చేపట్టారు. వారికి నల్ల కండువాలు వేసి వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దీక్షను ప్రారంభించారు. దీక్షకు మాజీ మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, మేకతోటి సుచరిత, తానేటి వనిత సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ డిఎస్సి -2025లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, దీనిలో నస్టపోయిన వారికి న్యాయం జరిగే వరకు వైసిపి పోరాటం కొనసాగుతుందని అన్నారు. డిఎస్సిలో అక్రమాల్లో రోజుకో అంశం బయటకొస్తోందని, అనర్హులు టీచర్లుగా నియమితులైనట్లు ప్రభుత్వమే తేల్చిందని తెలిపారు. నాలుగైదు జిల్లాల్లో రహస్యంగా విచారణ చేస్తున్నట్టు పత్రికల్లో చూస్తున్నామని అన్నారు. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు అడుగడుగునా అక్రమాలు జరిగాయని ఇప్పటికే తేలిపోయిందని అన్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబుచ మేకతోటి సుచరిత, తానేటి వనిత మాట్లాడుతూ గురువులను స్మరించుకోవడంతో పాటు వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, అటువంటి గురువుల్లోనూ కూటమి పాలకులు నకిలీలను తీసుకొచ్చారని విమర్శించారు. గురు పరిరక్షణ దీక్ష నుంచి ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలిపారు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు చేయకపోతే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాల్లో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోందని, అర్హత లేని వారికి ఉద్యోగం కట్టబెట్టి కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని అన్నారు. సాయంత్రం మాజీ మంత్రి సురేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.








కామెంట్లు (0)