- ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పర్యాటక రంగంలో బీచ్ షాక్స్ విధానానికి వైసిపి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శించారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీచ్ షాక్స్ విధానానికి వైసిపి ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. 2020 డిసెంబర్ 28వ తేదిన టూరిజం డెవలప్మెంట్ పాలసీ పేరుతో జివో 11ను వైసిపి ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. ఆ జివోలో బీచ్ షాక్స్ గురించి ప్రతిపాదించింది వైసిపి ప్రభుత్వం కాదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను కూటమి ప్రభుత్వం పూర్తిగా సవరించిందని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులు సేదతీరడానికి అనువుగా, దూరంగా ఉండే నిర్దేశిత తీర ప్రాంతాలలో మాత్రమే బీచ్ షాక్స్ ఏర్పాటు చేసేలా ఒక మంచి విధానాన్ని తాము తీసుకొచ్చామన్నారు. బీచ్ షాక్స్ నిర్వహణలో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్టమైన సెక్యూరిటీ, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి, అన్ని రకాల జాగ్రత్తలతో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.








కామెంట్లు (0)