- కూర్చునేందుకు కూడా చోటు లేదంటూ ఆగ్రహం
విజయవాడ: పాస్పోర్ట్ కోసం విజయవాడ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో పాస్పోర్ట్ సేవలు ఆలస్యమవుతున్నాయి. దీంతో కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ సమస్య కారణంగా తమ పనులు ముందుకు సాగడం లేదని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కూర్చునేందుకు కూడా సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరిగాయని వారు చెబుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా తమకు ఎప్పుడు సేవలు అందుతాయో స్పష్టత లేకపోవడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వర్ సమస్య విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికే పరిమితం కాలేదని సిబ్బంది చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవలకు సంబంధించిన సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి మరో రెండు, మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని దరఖాస్తుదారులకు తెలియజేస్తున్నారు. సర్వర్ సమస్య ఎప్పుడు పూర్తిగా పరిష్కారమవుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో పాస్పోర్ట్ కోసం వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు త్వరగా సాంకేతిక సమస్యను పరిష్కరించి సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.







కామెంట్లు (0)