మాజీ డిజిపి ఎ.బి.వెంకటేశ్వరరావు
రావణ్ వరుస అరెస్టులు చట్ట వ్యతిరేకం
సోషల్ మీడియాలో కుల, మతాలను రెచ్చగొట్టడం సరికాదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, స్వతంత్ర పోరాట కాలంలో ఉన్న ఇటువంటి చట్టాలను ఇప్పుడు అమలు చేయడం సరికాదని మాజీ డిజిపి ఎ.బి.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం విజయవాడలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లమోతు చక్రవర్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఉపా చట్టం దుర్వినియోగం అవుతోందని, రావణ్ వరుస అరెస్టు లు చట్ట వ్యతిరేకంగా జరిగాయని తెలిపారు. రావణ్ వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని, అదే సమయంలో ఉపా చట్టం ఎవరి మీద పడితే వారిపై వినియోగించకూడదని అన్నారు. దీనివల్ల ప్రజా హక్కులు కాల రాసే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఇటువంటి కేసుల్లో ఉపా చట్టం ఎందుకు అమలు చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అవసరం లేకపోయినా చేతిలో అధికారం ఉందని ఉపా చట్టాన్ని వాడుతున్నారని, స్వాతంత్ర్య ఉద్యమంలోఈ చట్టాన్ని వాడారని,
తరువాత టాడా చట్టం తెచ్చి ఒక్కోచోట ఒక్కోవిధంగా వాడారని పేర్కొన్నారు. అది కూడా దుర్వినియోగం కావడం, ప్రజల్లో వ్యతిరేకత కారణంగా పివి నరసింహారావు హయాంలో టాడా చట్టాన్ని రద్దు చేశారని తెలిపారు. బిజెపి వచ్చాక ఉగ్రవాద నిరోధక చట్టంగా పోటా అని తెచ్చిందని, 2004 లో కాంగ్రెస్ వచ్చాక ఈ పోటా చట్టాన్ని రద్దు చేసిందని వివరించారు. 2014 లో బిజెపి అధికారంలోకి ఈ ఉపా చట్టాన్ని బాగా వాడిందని, ఎవరైనా గట్టిగా నోరు ఎత్తితే ఆ చట్టం ప్రయోగించారని తెలిపారు. వరవరరావు నేటికీ ముంబై నుంచి హైదరాబాదు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. మావోయిస్టు ల హక్కులను గౌరవిస్తామని, రావణ్ పై ఉగ్రవాద చట్టం కింద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో పెట్టిన అంశాలు కోర్టు లో నిలబడవని తెలిపారు. రావణ్ మావోయిస్టు సానుభూతి పరుడు అని తెలిసిందని పోలీసులు చెప్పడం ద్వారా రావణ్ కి కోర్టు రిమాండ్ విధించిందని అన్నారు. హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా రావణ్ మాట్లాడారని, దాన్ని కూడా సమర్థించబోమని తెలిపారు. నవంబర్ 2025 లో ఆ వీడియో కి ప్రజలు రిపోర్ట్ కొట్టారని, అప్పుడే ఆ వీడియో ను యూ ట్యూబ్ వాళ్లు తొలగించారని పేర్కొన్నారు. రావణ్ పెట్టిన వీడియో లు, ఏలూరులో జరిగిన సభల్లో వ్యాఖ్యలు చూశామని, వాటికి ఉపా చట్టం వర్తించదని తెలిపారు. వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం కలిగితే రాధామనోహర్ దాసు కేసు పెట్టాలని, ఎవరెవరో కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ ఉపా చట్టం ఉగ్రవాదులు కే కానీ సామాన్యులకు కాదని తెలిపారు. అస్మదీయిలు అనుకునే వారిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని
రావణ్ కు ఈ కేసులో శిక్షలు పడే అవకాశం లేదని తెలిపారు. రావణ్ వ్యాఖ్యలు పై చట్ట పరంగా వెళితే బెయిల్ వస్తుందని, పాలకులే ఉపా చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయాలని చేశారని విమర్శించారు. భవిష్యత్లో ప్రశ్నించే ప్రతి ఒక్కరి పైనా ఉపా చట్టం పెడతారని, యూ.పి లో 34 వేల అరెస్టు లు జరిగితే 17వేల ఎన్ కౌంటర్లు జరిగాయని, న్యాయ స్థానానికి వెళ్లె అవకాశం లేకుండా ప్రభుత్వాలే చట్టాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. వీటిని వ్యతిరేకించక పోతే రేపు ప్రతి ఒక్కరూ ఈ చట్టం కింద కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉపా చట్టాన్ని పూర్తి రద్దు చేయాలని కోరారు.








కామెంట్లు (0)