- యునైటెడ్ ఎలెక్ర్టిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచెందుకై ప్రభుత్వం జారీ చేసిన జిఓ ఎంఎస్. నెం.45, విద్యుత్ సంస్థల్లో అమలు విషయంలో జాప్యం చేయవద్దని, తక్షణమే జిఓ అమలు చేయాలని ఎపి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. విద్యుత్ శాఖ, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుదర్శన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ నిర్ణయాన్ని అమలు చేయడంలో జాప్యం చేయకుండా, వెంటనే విద్యుత్ సంస్థల్లో అమలులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెం.45 అమలులో ఆలస్యం కొనసాగితే ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల సంస్థల పరిపాలనపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ నిర్ణయాలపై ఉద్యోగులకు పూర్తి విశ్వాసం కల్పించాలంటే, జి.ఓ. నెం.45ను విద్యుత్ రంగంలో తక్షణమే అమలు చేయడం అత్యవసరమని తెలిపారు. విద్యుత్ సంస్థలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలేనని, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు విద్యుత్ సంస్థలకు వర్తిస్తాయని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం 2014 అనుసరించి షెడ్యూలు 9,10 లో వున్న అన్ని కార్పొరేషన్లకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ఉత్తర్వులు వర్తిస్తాయని జిఓ నెం.45 లో స్పష్టంగా పేర్కొన్నప్పటికి జాప్యం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆలస్యం కొనసాగితే న్యాయపరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాల్లో తమ హక్కుల సాధనకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వుంటుందని పేర్కొన్నారు.








కామెంట్లు (0)