భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య
ప్రజాశక్తి - పెందుర్తి (విశాఖపట్నం) : విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో విషాదం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అనంతరం భర్త ఉరివేసుకుని మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో మల్లా ప్రవీణ్ కుమార్ (35), ఆయన భార్య అహల్య (25), చిన్నారులు హితీక్ష (4), హన్సిక (2) ఉన్నారు. సిఐ సతీష్ కుమార్ కథనం మేరకు.. విజయనగరం జిల్లా కొత్తవలస దరి మిల్లి రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన మల్లా ప్రవీణ్ కుమార్ ఆరు నెలల క్రితం జీవనోపాధి కోసం పెందుర్తి మండలం చింతల అగ్రహారానికి వచ్చారు. తన అత్తవారి ఇంటికి సమీపంలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. రాఖీ పండగ సందర్భంగా శుక్రవారం వారంతా ఆనందంగా గడిపారు. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులకు ‘ఆర్ఐపి’ అంటూ సెల్ఫోన్ ద్వారా ప్రవీణ్ కుమార్ సందేశం పంపించారు. భార్య, పిల్లలకు విషమిచ్చి తాను ఉరి వేసుకుని మృతి చెందారు. ఆర్థిక సమస్యలే ఆ కుటుంబంలో ఇంతటి విషాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్కు తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందిన ఘటనపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.








కామెంట్లు (0)