- సిఎం హామీ నేపధ్యంలో నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)నిబంధనలపై చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను యుటిఎఫ్ విరమించింది. ప్రత్యేక టెట్లో ఉపాధ్యాయులను ఉత్తీర్ణులయ్యేలా చేయడం తమ బాధ్యత అని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు దీక్షలను విరమించినట్లు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ శనివారం తెలిపారు. ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ‘టెట్లో ఉపాధ్యాయులందరినీ ఉత్తీర్ణులయ్యే చేయాల్సిన బాధ్యత మాదే’ అని స్పష్టమైన హామీ సిఎం ఇచ్చారని తెలిపారు. ఈ నేపధ్యంలో నిరవధిక నిరాహార దీక్షలను విరమిస్తునట్లు తెలిపారు. ఎపిజెఎసి చైర్మన్ ఎ విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎపిఎన్జివో ప్రధాన కార్యదర్శి డివి రమణ దీక్షలో పాల్గొన్న ఉపాధ్యాయ నాయకులకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్షలను విరమించినప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిసాస్తామని యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ చెప్పారు.
ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయొద్దు: బాబూరావు
ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయడం సరికాదని ఎపి పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబూరావు అన్నారు. రెండో రోజైన శనివారం దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో,కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయని, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్23(1)ను సవరించేందుకు కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టెట్ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించి అర్హత మార్కులను 40శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ టెట్ పేరుతో ఉపాధ్యాయులను ఆవేదనకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు ఎఎన్ కుసుమకుమారి, కార్యదర్శులు బి లక్ష్మిరాజా, ఎస్పి మనోహర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)