- గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకు రావాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, సమాజ నిర్మాణంలో యువత పాత్రను గవర్నర్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రహిత దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం యువతతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ‘నషా ముక్త్ యువ’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 100 వారాల ‘జన్ భాగీదారి’ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచార కార్యక్రమంలో లోక్ భవన్ నుంచి పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మై భారత్ రాష్ట్ర డైరెక్టర్ కె. వెంకట ఉజ్వల్, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఈగల్ ఎస్పీ జి. స్వరూప రాణి, ఎన్టీఆర్ జిల్లా యువజన అధికారి బి. ప్రదీప్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉద్యమంలో భాగస్వాములమవుదాం
డ్రగ్స్ నిర్మూలనపై దేశవ్యాప్తంగా 100 వారాలు కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాలని ప్రధాని ఇచ్చిన పిలుపుతో ఈ జాతీయ ఉద్యమంలో అందరం భాగం అవుదామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈగల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సమాజభాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అలుపెరుగని కృషి చేస్తున్నామని తెలిపారు.








కామెంట్లు (0)