ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్రెడ్డి
ప్రజాశక్తి-కడప అర్బన్ : ఎల్నినో ప్రభావిత వైఎస్ఆర్ కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి కోరారు. కడప రైతు సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో తగినంత వర్ష పాతం నమోదుకాక పంటల సాగు చేయలేదన్నారు. ఇప్పటికే కరువు ఛాయలు అలుముకున్నాయని, భూగర్భ జలాలు పడిపోతున్నాయని వివరించారు. తక్షణమే ప్రభుత్వం కరువు బృందాలను పంపి కరువు అంచనా వేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి ఎద్దడికి చెరువుల నింపుదల, ఆరుతడి పంటలకు నీరంధించి కరువు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. తెలుగు గంగ, కెసి కెనాల్కు నీటి కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కరువు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న కాలంలో దశల వారి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.








కామెంట్లు (0)