ప్రజాశక్తి -మాచర్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వరికపుడిసెల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జల వనరుల శాఖ జిఒ ఆర్టి 334ను బుధవారం జారీ చేసింది. కృష్ణా డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనల మేరకు, వరికపుడిసెల ఎత్తిపోతల పథకం కింద పైపుల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన భూ సేకరణ పనుల కోసం రూ.63.14 కోట్లు కేటాయించింది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.88 కోట్లుగా నిర్ణయించగా, ప్రస్తుతం భూ సేకరణకు మాత్రమే రూ.63.14 కోట్లు మంజూరైంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని మెట్ట ప్రాంతాలకు పైపుల ద్వారా సాగునీరు అందే అవకాశం ఏర్పడనుంది. దీంతో వేలాది ఎకరాల భూమికి నీటి వసతి కలిగి వ్యవసాయ ఉత్పత్తి పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. పల్నాడుకు దశాబ్దాల కలగా ఉన్న వరికపుడిసెల ప్రాజెక్టు అమలుకు ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
రైతుల కల సాకారం దిశగా..
ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు తన అధికారిక సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న వరికపుడిసెల ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేసి, పల్నాడు వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి పోయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు.









కామెంట్లు (0)