- 23న టెహ్రాన్లో ఖమేనీ స్మారక సభ
టెహ్రాన్ : సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించట్లేదు. ఇటీవల పూర్తయిన ఆయన తండ్రి, మత పెద్ద అలీ ఖమేనీ అంత్యక్రియల్లో సైతం మొజ్తబా పాల్గొనలేదు. అయితే త్వరలో ఆయన ప్రజల ముందుకు రానున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ నెల 23న టెహ్రాన్లో అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను మొజ్తబా నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో నిర్వహించే ఈ సభలో దేశంలోని కీలక నేతలందరూ పాల్గొంటారని సమాచారం. తండ్రి అంత్యక్రియల్లోనే కాదు రెండు వారాల క్రితం జరిగిన ఆయన సతీమణి అంత్యక్రియల్లోనూ మొజ్తబా కనిపించలేదు. కాగా, మెజ్తాబాకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒకరు ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మొజ్తబా చికిత్స తీసుకుంటున్నట్టు కథనాలు వచ్చాయి. నాటి నుంచి ఇరాన్పై దాడులను సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ వస్తున్నారు. అయితే తండ్రి అంత్యక్రియలు అనంతరం మొజ్తబా సోషల్ మీడియా ద్వారా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది వారి దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దాన్ని కచ్చితంగా నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన టెలిగ్రామ్లో ఓ సందేశాన్ని విడుదల చేశారు.
మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు?
ఇటీవల జరిగిన అయతొల్లా అలీ ఖమేనీ అంతక్రియల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతక్రియల సమయంలో నల్లని మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అయితే, ఆ మాస్క్ పెట్టుకున్నది మొజ్తబా ఖమేనీయే అని కొందరు అంటున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు రహస్యంగా హాజరై ఉంటారని భావిస్తున్నారు. ఖమేనీ కుటుంబంలోని పసిబిడ్డ మృతదేహాన్ని ఉంచిన బాక్సును కూడా ఆ వ్యక్తి మోయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు, ఆ మాస్క్ వ్యక్తి అలీ ఖమేనీ పెద్ద మనవడు మహమ్మద్ జావెద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ పత్రిక చెబుతోంది. ఫిబ్రవరి 28న అమెరికా ఖమేనీ కాంపౌండ్పై చేసిన దాడిలో జావెద్ శరీరం తీవ్రంగా కాలిపోయిందని, ఇదే దాడిలో ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అంటోంది. కాగా, అలీ ఖమేనీ పెద్ద కుమారుడు ముస్తఫా సంతానమే జావెద్. అయితే ఈ ప్రచారంపై ఇరాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.








కామెంట్లు (0)