- అక్లాండ్ చేరిన ప్రధాని మోడీ
- ప్రధాని లక్సన్తో మోడీ ద్వైపాక్షిక చర్చలు
అక్లాండ్ : ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోడీ న్యూజీలాండ్ పర్యటన ఆరంభమైంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా శుక్రవారం ప్రధాని మోడీ న్యూజీలాండ్ రాజధాని ఆక్లాండ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో న్యూజీలాండ్ ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ ఘనంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. శనివారమంతా మోడీ బిజీబిజీగా గడపనున్నారు. ప్రధాని లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం అక్కడి ప్రవాస భారతీయుల నుద్దేశించి ప్రసంగించనున్నారు. గత 40 ఏళ్ళలో భారత ప్రధాని న్యూజీలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. గతేడాది మార్చిలో లక్సన్ భారత్లో పర్యటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలకు బలమైన వూతమివ్వడానికి ఈ పర్యటన ఉద్దేశించబడిందని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించుకోవడానికి గల మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
మోడీ పర్యటనను పురస్కరించుకుని ఆక్లాండ్లోని అద్భుతమైన స్కై టవర్ను త్రివర్ణ రంగులతో, లైట్లతో అలంకరించారు. వందేమాతరం పాడుతూ ప్రదర్శించిన సాంస్కృతిక కళా రూపాలు ఆకట్టుకున్నాయి. పంజాబ్, తమిళనాడు సంస్కృతులను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే కర్ణాటక, హిందూస్తానీ శాస్ర్తీయ సంగీతం జుగల్బందీ వినిపించారని మోడీ ఎక్స్ పోస్టులో తెలిపారు.
అద్భుతమైన ఫలితాలతో ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చానని మోడీ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో బలమైన బంధం ఇరు దేశాలకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆక్లాండ్కు రావడానికి ముందుగా ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్కు పుట్టినిల్లుగా పిలిచే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)ని ఆ దేశ ప్రధాని అల్బనీస్తో కలిసి మోడీ తిలకించారు.








కామెంట్లు (0)