- చమురు ధరల పెరుగుదల
వాషింగ్టన్: ఇరు దేశాల మధ్య సంఘర్షణను ముగించే ఒప్పందంలో భాగంగా ఇరాన్ చమురు అమ్మకాలపై విధించిన ఆంక్షల మినహాయింపులను అమెరికా రద్దు చేసింది. గత నెలలో కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు విక్రయించడానికి ఇరాన్కు మంజూరు చేసిన 60 రోజుల తాత్కాలిక ఆంక్షల మినహాయింపును రద్దు చేసినట్లు అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించింది. దీంతో, అమెరికా ఇరాన్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలను వాస్తవంగా పునరుద్ధరించింది. ఈ ఆకస్మిక చర్యకు గల కారణాన్ని ట్రెజరీ అధికారులు స్పష్టం చేయలేదు. ప్రపంచ చమురు రవాణాకు ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిలో మూడు చమురు ట్యాంకర్లపై దాడి జరిగినట్లు సైన్యం ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత అమెరికా ఈ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఈ నౌకలపై దాడులు జరిగాయి. నౌకలను వెళ్లనివ్వడానికి అమెరికా సాయుధ బలగాలను ఉపయోగించే ప్రయత్నాన్ని ఇరాన్ ప్రతిఘటించింది. తాత్కాలికంగా ఎత్తివేసిన ఆంక్షలను అమెరికా మరింత కఠినతరం చేయడం ఈ ప్రాంతంలో దౌత్య చర్చలను మరింత క్లిష్టతరం చేస్తుందని, అలాగే అంతర్జాతీయ చమురు ధరలలో భారీ హెచ్చుతగ్గులకు కారణం కాగలదని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖాసెమ్ గరీబాబాది ఆరోపించారు. లెబనాన్ నుండి ఇజ్రాయిల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోకపోవడం, ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా చేసిన ప్రకటనలే ఈ ఒప్పంద ఉల్లంఘనకు కారణాలని ఆయన 'ఎక్స్' వేదిక ద్వారా తెలిపారు . తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు .
చమురు ధరల పెరుగుదల
ఇరాన్పై విధించిన చమురు ఆంక్షలపై ఇచ్చిన రాయితీలను రద్దు చేయడంతో, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 5 శాతానికి పైగా పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 5.5 శాతం పెరిగి బ్యారెల్కు 75 డాలర్లకు పైగా చేరింది.








కామెంట్లు (0)