- అయోధ్య ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్
లక్నో : అయోధ్య రామ మందిరం విరాళాల వివాదంపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనీల్ మిశ్రా చేసిన రాజీనామాలను శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఆమోదించింది. రామ జన్మభూమి తీర్ధ క్ష్రేత్ర ట్రస్టీ కృష్ణమోహన్ను ట్రస్టు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయోధ్యలో సోమవారం జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయాన్ని ట్రస్టు ప్రకటించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం లేదా చౌర్యం ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశానికి ముందు రామాలయ ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తొలి ప్రకటన చేశారు. ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలు, నిదులు చౌర్యానికి గురైనట్లు వార్తలు రావడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ పాప కార్యానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని పేర్కొన్నారు. కోట్లాదిమంది ప్రజల విశ్వాసంతో ముడిపడిన ఈ అంశం నుండి ఎవరూ రాజకీయ ప్రయోజనం పొందరాదంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సిట్ ముందు ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా హాజరయ్యారు. విరాళాలు దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అంశాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. ఇటువంటి కుంభకోణాలకు పాల్పడిన వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని సమాజ్వాదీ, ఆప్ తదితర పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజల మత విశ్వాసాన్ని కాపాడే కన్నా అంతర్గత ఘర్షణలపైనే బిజెపి నాయకత్వం మరింతగా దృష్టి పెడుతోందని ఎస్పి అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. చౌర్యాలు, భూ కుంభకోణాలకు పాల్పడిన వారికి మోడీ సర్కార్ రక్షణ కల్పిస్తోందని ఆప్ నేత కేజ్రీవాల్ విమర్శించారు.








కామెంట్లు (0)