- ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ మార్చ్ ఉద్రిక్తం
- పలువురు విద్యార్ధుల అరెస్ట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్రశ్నపత్రం లీక్, అలాగే యుజిసి నెట్ పరీక్షలో తీవ్ర సమస్యలకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఎన్టిఎ ప్రధాన కార్యాలయంకు పాదయాత్ర నిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో సోమవారం జరిగిన ఈ పాదయాత్రను పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు అడ్డుకున్నాయి. అనంతరం విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఎలామన్, సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా, ఉపాధ్యక్షుడు ఆరిఫ్ సిద్ధిఖీ ‘చలో ఎన్టిఎ’ అనే నినాదంతో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎన్టిఎను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అయితే, వినతిపత్రాన్ని సమర్పించేందుకు అనుమతించాలని విద్యార్ధులు కోరగా, అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో తమ డిమాండ్లను అంగీకరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు. ఆందోళన కొనసాగిస్తున్న ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. శాంతియుతంగా నినాదాలు చేస్తున్న విద్యార్థులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. పోలీసుల దాడిలో విద్యార్థినులు, ఇతరులు గాయపడ్డారు. అనంతరం విద్యార్థులను బస్సుల్లో కుక్కి పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. పోలీసుల అణచివేతతో విద్యార్థుల గొంతులను అణచివేసే ప్రయత్నాలు, విద్యా రంగంలో న్యాయం, జవాబుదారీతనం కోసం జరుగుతున్న పోరాట స్ఫూర్తిని నీరుగార్చలేవని ఎస్ఎఫ్ఐ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ ఢిల్లీ ఇన్స్టాగ్రామ్ పేజీని లాక్ చేసిన సంగతి తెలిసిందే.








కామెంట్లు (0)