బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తిరుపతి ఎయిర్‌పోర్టును ప్రయివేటుకు ఇవ్వొద్దు : సిపిఐ(యం)

2 గంటల క్రితం

Do not hand over Tirupati Airport to the private sector: CPI(M)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : తిరుపతి విమానాశ్రయాన్ని పిపిపి పద్ధతిలో ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. తిరుపతి ఎయిర్పోర్టును ప్రభుత్వ రంగంలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. వ్యూహాత్మకంగా విలువైన జాతీయ సంపదలో ఎయిర్ పోర్టులు ముఖ్య భాగం అని, అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే దేశానికి మంచిది అని చెప్పారు. అందుకు భిన్నంగా 11 ఎయిర్ పోర్టులను పిపిపి విధానంలో ప్రైవేటుపరం చేయాలని ఇటీవల సమావేశమైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతి విమానాశ్రయం కూడా వాటిలో ఉండడం ఆందోళనకరం అని అన్నారు. తిరుపతి విమానాశ్రయం ద్వారా ఇప్పటికే ఏటా 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రధాన నగరాలతో ఇప్పటికే కనెక్టివిటీ కలిగి ఉన్న తిరుపతికి ఇంకొన్ని విమానయాన సంస్థలు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న తిరుపతి విమానాశ్రయాన్ని ఇంకా మెరుగుపర్చాల్సింది పోయి ప్రైవేటుకు ఇవ్వాలనుకోవడం తగదు అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతిలో విమానాశ్రయం ప్రభుత్వ అజమాయిషిలో ఉంటేనే యాత్రికులకు సౌకర్యవంతంగానూ, అదనపు భారాలు పడకుండా వుంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తిరుపతి విమానాశ్రయం ఏఏఐ పరిధిలోనే కొనసాగేలా చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి తిరుపతి జిల్లా ప్రజానీకం దీనిపై గళం విప్పి కాపాడుకోడానికి ముందుకు రావాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్