విజయవాడ : వెలుగొండ ప్రాజెక్టు కోసం మొదటి నుండి పోరాడుతూ నేడు నిర్వాసితుల పక్షాన నిలబడుతున్న సిపిఐ(యం), ప్రజాసంఘాల నాయకులపై ప్రభుత్వ నిర్బంధాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. మార్కాపురం పట్టణంలో జిల్లా పార్టీ కార్యదర్శి డి.సోమయ్య, జిల్లా నాయకులు బాలనాగయ్య, రఫీ రూబెన్, రైతు సంఘం సీనియర్ నాయకులు వెంకటరామిరెడ్డితో సహా మరో 8 మంది ఇళ్ల దగ్గర పోలీసులు కాపలా పెట్టి దిగ్బంధించారని, వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మార్కాపురం వస్తున్న నేపథ్యంలో ... పోలీస్ యంత్రాంగం సిపిఐ(యం) మార్కాపురం జిల్లా కార్యాలయాన్ని ఆక్రమించి పార్టీ, ప్రజాసంఘాల నాయకులను నిర్బంధానికి గురిచేయడం గర్హనీయమన్నారు. గత 30 సంవత్సరాలుగా వెలుగొండ ప్రాజెక్టు కోసం పోరాడుతున్నది సిపిఎం, వామపక్షాలు, ప్రజాసంఘాలేనన్నారు. ప్రాజెక్టు మొదటి నుండి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం కోసం పోరాడుతున్నవారిని గత మూడు రోజులుగా వెంటాడుతూ అరెస్టు చేయటం, సిపిఎం ఆఫీస్ వద్ద, ప్రజాసంఘాల నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను కాపలా పెట్టి నిర్భంధానికి గురిచేయడం ప్రభుత్వపు నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నదన్నారు. ఇలాంటి దుర్మార్గపూరితమైన చర్యలు ప్రభుత్వపు అభద్రతను రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఇది ప్రజలను, ప్రజాఉద్యమాలను అవమానించేవిగా ఉన్నాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తూనే అర్హులైన ప్రతి నిర్వాసితుడికి ఒక స్థిర నివాసం నష్టపరిహారం అందేవరకు, చివరి ఎకరం భూమికి నీరందే వరకు పోరాటం కొనసాగుతుందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రకటిస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సిపిఐ(యం) నాయకుల అరెస్టు పై రాష్ట్ర కమిటీ ఖండన
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)