విజయవాడ : ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు అరుణ్ జీ (కె.నరసింహారావు) మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను బుధవారం విడుదల చేశారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజానాట్యమండలిపై ప్రభుత్వం నిషేధం విధించిన తరువాత ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో అరుణ్ జీ కీలకపాత్ర పోషించారన్నారు. 1990 నుండి తనకు అరుణ్ జీ తో, వ్యక్తిగతంగా ప్రత్యక్ష సంబంధాలున్నాయన్నారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడారు. జీవితచరమాంకం వరకు కళను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి తపనపడ్డారని, సఫ్టర్ హష్మి స్పూర్తితో వీధి నాటికల్లో శిక్షణనిచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేకమందిని తీర్చిదిద్దారన్నారు. ఆరు నెలల క్రితం కూడా ఒక మీటింగ్లో ఆయనను కలిశానని గుర్తు చేసుకున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నా ఆయనలో సడలని పట్టుదల చూశానన్నారు. ఆయన మృతి కళా రంగానికి, సాంస్కృతికోద్యమానికి తీరని లోటని వి.శ్రీనివాసరావు విచారాన్ని వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు









కామెంట్లు (0)