హెచ్చరించిన సుప్రీం
యువ లాయర్లకు ఫండ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : న్యాయవాద వృత్తిలో మేథో వలస తలెత్తే ప్రమాదముందని సుప్రీం హెచ్చరించింది. ఆర్థికంగా ఇబ్బందులు పడే యువ లాయర్లు జీవితంలో మరింత ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం న్యాయవాద వృత్తిని విడనాడినట్లైతే మేథో వలస ముప్పు తలెత్తుతుందని పేర్కొంది. ఈ పరిస్థితిని నివారించాలంటే, ప్రతి రాష్ట్రంలోనూ, కేంద్ర పాలిత ప్రాంతంలోనూ యువ లాయర్లకు వృత్తిపరమైన సహాయ నిధిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలినాళ్ళలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వుంటాయని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుండి వచ్చిన వారికి ఇవి బాగా తెలుస్తాయని పేర్కొంది. కుటుంబాన్ని పోషించాల్సిన భారం తమపై వుండడంతో చాలా మంది యువ న్యాయవాదులు తమ వృత్తిని వదిలిపెట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా గల బార్ సభ్యులందరికీ మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ చర్యలను తీసుకోవాలని కోరుతూ ఆరుగురు మహిళా లాయర్ల బృందం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీం కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. స్టయిఫండ్ కూడా లేకుండా సీనియర్ల వద్ద పనిచేసే యువ లాయర్లు వున్నారంటూ వారు ఎదుర్కొనే ఇబ్బందులను పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీం స్పందిస్తూ, హైకోర్టుల పరిధిలో వారి నియంత్రణలో ఒక నిధిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్వయంప్రతిపత్తి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిధి ఏర్పాటు వుండాలని సూచించింది. కోర్టు ఫీజుల్లో కొంత మొత్తం, జ్యుడీషియల్ కార్యకలాపాలకు అయిన ఖర్చులో కొంత భాగాన్ని ఈ నిధికి అందజేయాలని కోర్టు ప్రతిపాదించింది. విరాళాలను ప్రోత్సహించేందుకు దాతలకు పన్ను మినహాయింపు, జాతీయ పురస్కారాలు, ఇతర రకాల గుర్తింపును అందజేయాలని సూచించింది.








కామెంట్లు (0)