శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Chandipura virus - చాందీపుర వైరస్‌ కలకలం.. నెల రోజుల్లో 25 మంది చిన్నారుల మృతి

14 గంటల క్రితం

Chandipura virus scare: 25 children die in a month.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 09:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గుజరాత్‌ : రాష్ట్రంలో చాందీపుర వైరస్‌ కలకలం రేపుతోంది. గత నెల రోజులుగా వైరస్‌ బారినపడి 25 మంది చిన్నారులు మృతిచెందారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యులు, పరిశోధకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వైరస్‌ వాహకాల గుర్తింపు కోసం వేలాది శాంపిళ్లను పరీక్షించినప్పటికీ వైరస్‌ ఆనవాళ్లు లభించలేదు. దీంతో దోమలు, ఇతర కీటకాలు వైరస్‌ వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్న అనుమానంతో పరిశోధనలు ముమ్మరం చేశారు.


జూన్‌ 30 నుంచి ప్రారంభమైన ప్రస్తుత వైరస్‌ వ్యాప్తిలో ఇప్పటివరకు 39 మంది చిన్నారులకు చాందీపుర వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా వైరస్‌ వ్యాప్తికి ప్రధాన వాహకంగా భావించే శాండ్‌ఫ్లై (ఇసుక ఈగ)లను వేల సంఖ్యలో సేకరించి పరీక్షించినప్పటికీ వాటిలో వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదు. దోమలు, ఇతర కీటకాలపై నిర్వహించిన పరీక్షల్లోనూ ఫలితాలు ప్రతికూలంగానే వచ్చాయి. 2024లో చాందీపుర వైరస్‌ కారణంగా 28 మంది చిన్నారులు మృతిచెందిన సమయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.


ప్రస్తుతం గుజరాత్‌లోని 12 జిల్లాలతో పాటు రాజస్థాన్‌లోని మూడు జిల్లాల్లో చాందీపుర వైరస్‌ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా తూర్పు గుజరాత్‌లో ఎక్కువగా కనిపించే ఇసుక ఈగలకు భిన్నంగా పశ్చిమ గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోనూ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒకటి కంటే ఎక్కువ రకాల కీటకాలు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


జాతీయ స్థాయి వైద్య నిపుణులు కూడా పరిశోధనల్లో పాల్గొంటున్నారు. దోమలు, పేలు, నల్లులు తదితర కీటకాలను పరిశీలిస్తూ వైరస్‌ మూలాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. పశువుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించినప్పటికీ వాటిలోనూ వైరస్‌ జాడ కనిపించలేదు. దీంతో చాందీపుర వైరస్‌ వ్యాప్తికి కారణాలను గుర్తించడం వైద్య నిపుణులకు సవాల్‌గా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్