న్యూఢిల్లీ : ఆన్లైన్ బెట్టింగ్ సంస్థ పరిమ్యాచ్తో పాటు మరికొన్ని సంస్థలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. పేమెంట్ కంపెనీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు), కంపెనీ సెక్రటరీలకు (సీఎస్లు) సంబంధించిన కార్యాలయాలు, ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఐదు, ఢిల్లీ-ఎన్సీఆర్లో నాలుగు, రాజస్థాన్లో రెండు, గుజరాత్లో ఒక చోట కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును సీఏలు, సీఎస్ల సహకారంతో నగదుగా మార్చడం, అక్రమ చెల్లింపులకు వినియోగించడం, పేమెంట్ గేట్వేల ద్వారా విదేశాలకు తరలించడం వంటి ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఒడిఐ) పేరుతో "బూటకపు" లావాదేవీల ద్వారా నిధులను విదేశాలకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేమెంట్ సంస్థల పాత్రపైనా అధికారులు దృష్టి సారించారు.
ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వినియోగదారులను మోసం చేసినట్లు ఆరోపిస్తూ parimatch.comపై ముంబై పోలీసుల సైబర్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ మనీలాండరింగ్ కేసును ఈడీ చేపట్టింది. ఈ కేసులో పరిమ్యాచ్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపు మార్గాలు, నిధుల తరలింపుపై దర్యాప్తు జరుగుతోంది.
ఇదే కేసులో ఈడీ గతంలోనూ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. తాజా సోదాల్లో లభించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.








కామెంట్లు (0)