న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ పి.ఎస్.నరసింహ ఐదవ సభ్యునిగా నియమితులయ్యారు. జస్టిస్ జె.కె.మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ పి.ఎస్.నరసింహ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ నరసింహ 2028 మే 2న పదవీ విరమణ చేసే వరకు అధికారికంగా కొలీజియంలో కొనసాగుతారు. ప్రస్తుతం కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బి.వి.నాగరత్నం, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ పి.ఎస్.నరసింహ సభ్యులుగా ఉన్నారు. 1993 సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అమల్లోకి వచ్చిన కొలీజియం వ్యవస్థ ప్రకారం.. సుప్రీంకోర్టుకి చెందిన ఐదుగురు సీనియర్ జడ్జీలు సుప్రీంకోర్టుతో పాటు 25 హైకోర్టులకు జడ్జీల నియామకం, బదిలీ మరియు పదోన్నతులకు సంబంధించిన సిఫారసులు చేస్తారు.
1963 మే 3న హైదరాబాద్లో జన్మించిన జస్టిస్ నరసింహ, నిజాం కాలేజీ నుండి అర్థశాస్త్రం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ట్రిపుల్ మేజర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 1998లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదైన ఆయన, సుప్రీంకోర్టుకు తన ప్రాక్టీస్ను మార్చుకునే ముందు హైదరాబాద్లోని హైకోర్టు, సివిల్ కోర్టులు, ట్రిబ్యునల్స్లో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు.రాజ్యాంగ ధర్మాసనం సహా పలు కేసుల్లో జడ్జీగా వ్యవహరించారు.








కామెంట్లు (0)