దుకాణాల ముందు వెలుస్తున్న బోర్డులు..
న్యూఢిల్లీ : యుపిఐ చెల్లింపులపై ఛార్జీలను వసూలు చేయడాన్ని వ్యాపారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధించాలన్న నిర్ణయం వర్తక వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త రుసుమును వ్యాపారులు భరించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండటంతో అంతిమంగా ఈ భారం తమపైనే పడుతుందని ఆందోళన చెందుతున్న వివిధ వ్యాపార సంఘాలు, డీలర్లు నిరసనబాట పట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పలువురు దుకాణదారులు తమ వ్యాపార సంస్థల వెలుపల ‘ఇక్కడ యుపిఐ చెల్లింపులు స్వీకరించబడవు- నగదు ఇవ్వగలరు లేదా అదనపు ఛార్జీలను చెల్లించగలరూ.’ అంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నగదు కాకుండా యుపిఐ చేస్తే అదనంగా రూ.1 అదనంగా చెల్లించాలని ఓ పానీపూరి దుకాణం నిర్వాహకుడు పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పెట్రోల్ బంకుల డీలర్లు సైతం అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన యుపిఐ చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంధన విక్రయాలపై కమీషన్లు పెరగకపోగా.. విపరీతంగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారంగా మారిన నేపథ్యంలో ఈ ఛార్జీలను భరించలేమని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది.







కామెంట్లు (0)