- కొత్తది లేదా రీఇష్యూకు రూ.2500
- తత్కాల్ రూ.5000
న్యూఢిల్లీ : పాస్పోర్ట్ దరఖాస్తు రుసుములను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సాధారణ పాస్పోర్ట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి లేదా 36 పేజీల పాస్పోర్ట్ను రీ-ఇష్యూ చేయించుకునే వారికి ఇకపై ఫీజు రూ.2,500 వసూలు చేస్తారు. 60 పేజీల పాస్పోర్ట్ కావాలనుకునే అభ్యర్థులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుల పెంపు తత్కాల్ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా వర్తిస్తుంది. తత్కాల్ కింద 36 పేజీల పాస్పోర్ట్ ధర ఏకంగా రూ.5000కు పెంచారు. 60 పేజీల పాస్పోర్ట్ ధర రూ.6000 నిర్ణయించారు. సవరించిన నిబంధనల ప్రకారం పోగొట్టుకున్న, చోరీకి గురైన లేదా పాడైపోయిన పాస్పోర్ట్ల స్థానంలో కొత్తవి పొందేందుకు అయ్యే ఖర్చును కూడా పెంచారు. తత్కాల్ కేటగిరీ కింద, పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న 36 పేజీల పాస్పోర్ట్ను మార్చుకోవడానికి ఫీజు రూ.7,500గా నిర్ణయించారు. 60 పేజీల పాస్పోర్ట్ కోసం దరఖాస్తుదారులు రూ.8,500 చెల్లించాలి. మైనర్ల కోసం కొత్త పాస్పోర్ట్ లేదా 36 పేజీల పాస్పోర్ట్ రీ-ఇష్యూ ధర రూ.1,750 గా ఉంటుంది. తత్కాల్ స్కీమ్ కింద ఈ ఫీజును రూ.4,250 గా స్థిరపరిచారు. ఇక, చివరిసారిగా, పాస్పోర్ట్ ఫీజుల్లో సవరణ 2012లో జరిగింది. అప్పటి ప్రభుత్వం ప్రామాణిక 36-పేజీల పాస్పోర్ట్ ఫీజును రూ.1,000 నుంచి రూ.1,500కి, అలాగే, తత్కాల్ ఫీజును రూ. 2,500 నుంచి రూ. 3,500కి పెంచింది.









కామెంట్లు (0)